చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనల నుండి ఉదాహరణలు
బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం:
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ
అర్జునుడిలా అన్నాడు:-
మగువ మీదను పతికింత మక్కువైన
మగువ మీదను పతికింత మమతయున్న
పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు
పుట్టింటి సొమ్ములెన్ని తీసుకొన్నా ఆడువారు మెట్టింటివైపే మాట్లాడుతారంటూ కృష్ణుడు పలికిన విధం:-
సార చీరెలు నగలును చాలగొనుచు
పుట్టినిండ్ల గుల్లలు జేసిపోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు
మగనిపై కూర్మి అధికము మగువకెపుడు
చతుర చంద్రహాసం నాటకంలో – పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు పట్టుబట్టినపుడు ధృతరాష్ట్రుడు పడిన ఆవేదన:-
కొడుకు నుడువులు వింటినా కులము సెడును
కులము మేలెంచుకొంటినా కొడుకు సెడును
కొడుకు కులమును జెడకుండ నడువ వలయు
లేనిచో వంశమున కెల్ల హాని గల్గు
“పకోడి” గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. “కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి” అని హాస్యోక్తులు విసరి ఆయన
పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
“గీత మంజరి” లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ
———–